
సత్యదేవుని కల్యాణానికి చురుగ్గా ఏర్పాట్లు
● ఏడు రోజుల పాటు నిర్వహణ
● అంగరంగ వైభవంగా జరిగేలా చర్యలు
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చేనెల ఏడో తేదీ వైశాఖ శుద్ధ దశమి నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలలో ఎనిమిదో తేదీ ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల నుంచి 11–30 గంటల వరకు దివ్య కల్యాణం జరగనుంది. రోజుకొక కార్యక్రమం చొప్పున ఏడు రోజుల పాటు 13వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈఓ, దేవస్థానం సిబ్బంది మధ్య అంతరం పెరిగినప్పటికీ ఉత్సవ ఏర్పాట్లలో అంతా బిజీగా ఉన్నారు.
శుభలేఖలు పంపిణీ ప్రారంభం
సత్యదేవుని కల్యాణ మహోత్సవాల శుభలేఖలను వీఐపీలు, ప్రజాప్రతినిధులకు అందచేసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే జిల్లా మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు శుభలేఖ అందచేసి ఆహ్వానించారు. ఇంకా జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులకు అందజేయాల్సి ఉంది.
రథం మరమ్మతులు పూర్తి
కల్యాణ మహోత్సవాలలో భాగంగా మే 11న సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్న రథోత్సవానికి కోనసీమ జిల్లాకు చెందిన శ్రీ మాణిక్యాంబ శిల్పకళ ఉడ్ వర్క్స్కు చెందిన కొల్లాటి శ్రీనివాస్ బృందం మరమ్మతులు పూర్తి చేశారు. ఉత్సవానికి దగ్గర చేసి ట్రయల్రన్ నిర్వహిస్తామని డీఈఈ ఉదయ్ కుమార్ తెలిపారు.
ధ్వజ స్తంభానికి అలంకరణ
దాత ఆర్థిక సహకారంతో గత ఏడాది బంగారు పూత వేయించిన ధ్వజ స్తంభానికి కుండలాలు కనిపించేలా ఆలయానికి సమాంతరంగా శ్లాబ్కు రంధ్రం చేసి అద్దాన్ని అమర్చి మిగిలిన పనులను శనివారం పూర్తి చేశారు. కల్యాణ మహోత్సవాల మొదటి రోజు ధ్వజారోహణం చేసి కార్యక్రమాలు ప్రారంభించి, ఆరో రోజు ధ్వజావరోహణ చేస్తారు.
విద్యుదలంకరణలు ప్రారంభం
సత్యదేవుని ఉత్సవాల సందర్భంగా విద్యుత్ అలంకరణలు చురుగ్గా సాగుతున్నాయి. స్వామివారి ఆలయం, రాజగోపురాలు, ఆలయ ప్రాంగణం, సత్రాలు, రామాలయం, తొలిపావంచా మెట్లుదారి తదితర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణ చేస్తున్నట్టు ఎలక్ట్రికల్ డీఈ వీ సత్యనారాయణ తెలిపారు.

సత్యదేవుని కల్యాణానికి చురుగ్గా ఏర్పాట్లు

సత్యదేవుని కల్యాణానికి చురుగ్గా ఏర్పాట్లు

సత్యదేవుని కల్యాణానికి చురుగ్గా ఏర్పాట్లు