
రూ.20 వేల విలువైన మద్యం స్వాధీనం
కొత్తపేట: మద్యం అక్రమంగా విక్రయిస్తున్న ఇంటిపై దాడి చేసి రూ.20 వేలు విలువైన 110 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్టు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు. కొత్తపేట మండలం వానపల్లి శివారు రామమోహనరావుపేటలో కుంచే రమేష్ అనే వ్యక్తి మద్యాన్ని అక్రమంగా తెచ్చి విక్రయిస్తున్నట్టు అందుకున్న సమాచారంతో ఎస్సై జి.సురేంద్ర సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. దీంతో రమేష్ సమీప పంట పొలా ల నుంచి పరారయ్యాడు. అనంతరం అక్కడి నుంచి రూ.20 వేలు విలువైన 110 మద్యం సీసాలతో పాటు, అప్పటికే విక్రయించిన మద్యం నగదు రూ 6,270, రమేష్ పరారవుతూ చేజార్చుకున్న సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
అమలాపురం రూరల్: మండలం నడిపూడి కాలువలో శుక్రవారం గల్లంతైన సరెళ్ల సురేష్ మృతదేహం శనివారం కాలువలో లభ్యమైయింది. నడిపూడి శ్రీరామ్ నగర్కు చెందిన సురేష్ శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు ప్రధాన పంట కాలువలో కాలుజారి పడ్డాడు. అతని కోసం స్థానికులు, పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సర్పంచ్ చెల్లుబోయిన వెంకటేశ్వరరావు చొరవతో ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి కాలువలోని నీటి ప్రవాహాన్ని తగ్గించి సురేష్ కోసం గాలించారు. అయినా రాత్రివరకు మృతదేహం లభ్యం కాలేదు. శనివారం నీటి ప్రవాహాన్ని పెంచడంతో సురేష్ మృతదేహం నడిపూడి లాకుల వద్దకు కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని గుర్తించిన తాలూకా పోలీసులు కాలువ నుండి బయటకు తీశారు. సురేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు తాలూకా ఎస్సై శేఖర్బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

రూ.20 వేల విలువైన మద్యం స్వాధీనం