
శృంగార వల్లభుని సన్నిధికి భక్తుల తాకిడి
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తుల తాడికి పెరిగింది. సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవలు, కేశఖండన టికెట్లు, అన్నదాన విరాళాలుగా స్వామివారికి రూ.3,23,118 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. నాలుగు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.
వైఎస్సార్ సీపీ అనుబంధ
విభాగాల్లో పలువురికి చోటు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన నలుగురికి రాష్ట్ర అనుబంధ విభాగాల్లో చోటు కల్పించారు. రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా కోరుమిల్లి లలిత, రాష్ట్ర ప్రచారం విభాగం ఉపాధ్యక్షుడిగా రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా లాలం అచ్యుత ఆనంద్ (బాబ్జీ), రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జాయింట్ సెక్రటరీగా దాడిశెట్టి నూకపతిరావు నియమితులయ్యారు.
మత్స్యకారులకు భృతి
పంపిణీ
కాకినాడ సిటీ: మత్స్యకార సేవ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 24,769 మంది అర్హుల ఖాతాలకు రూ.20 వేల చొప్పున రూ.49.54 కోట్ల మేర సముద్ర వేట నిషేధ కాల భృతి జమ చేశామని ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎంపీ సానా సతీష్బాబు, జిల్లా మత్స్యశాఖాధికారి వి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

శృంగార వల్లభుని సన్నిధికి భక్తుల తాకిడి