
ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోవాలి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏలూరు సాక్షి కార్యాలయంపై నిస్సిగ్గుగా దాడికి దిగిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరవర్గంపై కఠినచర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజె నాయకుడు స్వాతి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్షలను ఇలా మీడియాపై చూపడం తగదన్నారు. దాడి సందర్భంగా కార్యాలయంలోని కంప్యూటర్లు ధ్వంసం చేయడమేగాక, విధి నిర్వహణలో ఉన్న రిపోర్టర్పై దాడి చేయడం దారుణమన్నారు. సాక్షి పత్రికలో తనకు వ్యతిరేకంగా వార్త వచ్చిందని కార్యాలయంలోని పరికరాలను ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. పత్రికలో వచ్చిన వార్తలో వాస్తవాలు లేకపోతే వివరణ ఇవ్వాలే గానీ కార్యాలయంపైన, విలేకరులపైన దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేగా పత్రికాస్వేచ్ఛను కాపాడాల్సిన చింతమనేని కార్యాలయాన్ని ధ్వంసం చేయడం సరికాదు. ఈ దాడిని పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఏపీయూడబ్ల్యూజే పరిగణిస్తోందనారు. భవిష్యత్లో ఇలాంటి దాడులు జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చింతమనేనిపై సీఎం చంద్రబాబు క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
జూన్ కల్లా ఉత్తరాంధ్రకు
నీరు అందించడమే లక్ష్యం
కిర్లంపూడి: మండలంలోని కృష్ణవరం పోలవరం ఎడమ కాలువ పీకేజీ 3 పనులను నీటి పారుదలశాఖ మంత్రి నిమ్మల రామనాయుడు బుధవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి పరీశీలించారు. పనులు జరుగుతున్న తీరును ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా ఇంజినీర్లు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ జూన్ కల్లా ఫస్ట్ఫేజ్ పనులు పూర్తి చేసి ఎడమ మెయిన్ కెనాల్ ద్వారా పుష్కర, పురుషోత్తం పట్నం ఎత్తిపోతల నుంచి ఉత్తరాంధ్రకు నీటి తరలించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.