
‘దిశా’కు ప్రజాప్రతినిధుల డుమ్మా
సాక్షి, అమలాపురం: కేంద్ర ప్రయోజిత పథకాల అమలుతో పాటు జిల్లా స్థాయిలో జరిగే అభివృద్ధి పనుల మీద నిర్వహిస్తున్న దిశా సమావేశానికి అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధుల గైర్హాజరు కావడం విస్మయానికి గురి చేసింది. అమలాపురం కలెక్టరేట్లో బుధవారం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండపేట శాసన సభ్యుడు, అంచనాల కమిటీ చైర్మన్ వి.జోగేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్, అధికార టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఈ సమావేశంలో ప్రతిపక్షాల గొంతును నొక్కి వేస్తుండడం, వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్సీలకు మాట్లాడే అవకాశం లేకపోవడంతో వారు పాల్గొనేందుకు పెద్దగా మక్కువ చూపడం లేదు. కుంటుపడిన అభివృద్ధిపై ఎవరైనా ప్రశ్నించినా బయటకు రాకుండా మీడియాకు సైతం ప్రవేశం లేకుండా చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన వారూ పాల్గొనక పోవడం గమనార్హం. అమలాపురంలో జరిగిన ఒక ప్రైవేట్ మోటార్ సైకిల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురంలోనే జరిగిన దిశాకు ముఖం చాటేశారు. కాగా.. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఆర్థిక ఫలాలు లబ్ధిదారులకు అందించడంలో అధికారులు కీలక భూమిక పోషించాలని స్థానిక పార్లమెంట్ సభ్యుడు జి.హరీష్ మాధుర్ అన్నారు. జిల్లా పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల తీరుతెన్నులు, సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లు, అధికారుల సమన్వయం తదితర అంశాలపై స్థానిక కలెక్టరేట్లో బుధవారం జరిగిన దిశ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో వీవీఎస్.లక్ష్మణరావు పాల్గొన్నారు.