
పుస్తకం.. మహోన్నతం
● అక్షరమే అసలైన సంపద ● సమాజానికి వెలుగునిచ్చే దీపం ● పుస్తక రచనలో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక స్థానం ● నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం
సంతోషంగా ఉంది
చదువుకునే రోజుల్లో సామాజిక ఉద్యమాలకు ఆకర్షితుడినై విద్యార్థి, యువజన సంఘాల్లో పని చేశాను. గత కాలపు ఉద్యమాలను గ్రంథస్తం చేయాలన్న నా కోరిక ఇటీవల తీరింది.‘నవ సమాజం కోసం’ పేరుతో నేను రాసిన పుస్తకం ఈ ఏడాది మార్చి 9న కాకినాడలో ఆవిష్కృతమై ఆదరణ పొందింది.
– దువ్వా శేషబాబ్జీ, కాకినాడ
కపిలేశ్వరపురం: సమాజానికి వెలుగునిచ్చేది అక్షరం. అది పుస్తకాల రూపంలో ప్రజల చెంతనే ఉంటుంది. అలాంటి పుస్తకాలు రూపొందించడానికి ఎందరో మహానుభావులు అక్షర సేద్యం చేస్తున్నారు. సమాజంలో విజ్ఞాన జ్యోతులు వెలిగించడానికి కృషి చేస్తున్నారు. పుస్తక రచనలో దారులెన్ని ఉన్నా సామాజిక ప్రయోజనమే అంతిమ లక్ష్యం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనేక పుస్తక ప్రచురణా సంస్థలు, రచయితలు, కవులు సామాజిక ఉద్యమకారులు అలనాటి కందుకూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మారుతున్న మానవ సమాజ పోకడలకు తమ రచనల ద్వారా అద్దంపడుతున్నారు. సమాజ హితం కోరుతూ సాగుతున్న పుస్తక ప్రచురణ, రచన తదితర అంశాలపై నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
పుస్తక దినోత్సవ నేపథ్యం
ప్రపంచంలో సామాజిక సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో యునెస్కో స్పందించి పుస్తక పఠన ఆవశ్యకతను గుర్తించాలని ప్రపంచ దేశాలకు సూచించింది. కనుమరుగవుతున్న పుస్తక సంపదను కాపాడుకోవడానికి, భవిష్యత్తు తరాలకు జ్ఞానాన్ని పంచేందుకు యునెస్కో ఏప్రిల్ 23 ను ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజున సదస్సులు, సమావేశాలు, పరిశోధనాపరమైన అంశాలపై చర్చలు చేపట్టాలని సూచించింది.
ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక స్థానం
రాజమహేంద్రవరం కేంద్రంగా సాహితీ సేవలు విస్తారంగా సాగేవి. సమాజంలో దుర్మార్గాలు పెరిగిపోయినప్పుడల్లా పుస్తకమే ప్రజలను మేల్కొలిపేది. ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ‘నీతి కథామంజరి’ పేరుతో 158 కథలను సంకలనం చేస్తూ రాసిన పుస్తకం సీ్త్రల సమస్యలను వెలుగులోకి తెచ్చింది. ఆనాటి నుంచి నేటికీ జిల్లాలో సాహిత్య కృషి కొనసాగుతోంది. రాజమహేంద్రవరంతో పాటు కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, రామచంద్రపురం కొత్తపేట, అమలాపురం, యానాం ప్రాంతాల్లో పలు సాహితీ సంస్థలు, స్మారక సంస్థల ద్వారా పుస్తక ప్రచురణ, రచన, పఠన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
పరిశోధనలకు చేదోడు
చారిత్రక, సామాజిక అంశాలపై పరిశోధనలు చేసేవారికి జిల్లాలోని రూపుదిద్దుకున్న పుస్తకాలు దోహదపడతాయి. రాజమహేంద్రవరంలోని గౌతమి గ్రంథాలయం ఎంతో చారిత్రాత్మకమైంది. హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయానికి అనుబంధంగా నడుస్తున్న బొమ్మూరులోని తెలుగు సాహిత్యపీఠంలో సుమారు 50 వేల అరుదైన పుస్తకాలు ఉన్న గ్రంథాలయం ఉంది. కపిలేశ్వరపురం జమీందారీ దివాణం గ్రంథాలయంలోని పుస్తకాలను అధ్యయనం చేసిన పలువురు పీహెచ్డీ పట్టాలను పొందారు.
సాంకేతికత తోడుగా..
పెరిగిన సాంకేతికతను పుస్తక పఠనం పెంచడానికి వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని అనేక మంది సామాజిక మాధ్యమాల్లో సాహిత్య గ్రూపులను ఏర్పాటు చేసి పుస్తకాల్లోని అంశాలపై చర్చలు జరుపుతున్నారు. కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన పెద్దింశెట్టి రామకృష్ణారావు 250 మందితో పుస్తకం పేరుతో గ్రూపు ఏర్పాటు చేసి పుస్తకాలపై చర్చిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్టణం కేంద్రంగా నడుస్తున్న మంచి పుస్తకం వాట్సాప్ గ్రూపుల్లో మన జిల్లాకు చెందిన అనేక మంది భాగస్వాములయ్యారు.
పుస్తక రచన
భార్య జ్ఞాపకార్థం
మహనీయుల కృషికి అక్షర రూపం
పలు రచనలు
పుస్తకాన్ని రాయడమంటే పెద్ద చదువులు చదవాలనో, గ్రంథాలయాల్లో గంటల తరబడి గడపాలనో అనుకొంటే పొరబాటే. తన చుట్టూ జరుగుతున్న సంఘటనలకు అక్షర రూపం ఇస్తే చాలు. అలాంటి వారిలో రాజమహేంద్రవరానికి చెందిన దేవగుప్తపు పేరలింగం ఒకరు. ఆయన 13 పుస్తకాలను రచించగా వాటిలో కొన్నింటిని స్వతంత్రంగా ప్రచురించారు. తన సైకిల్కు ‘హేతువాద చైతన్య రథం’ అనే పేరుపెట్టి మూడు దశాబ్దాలకు పైగా సైన్స్, సామాజిక భావాలను ప్రచారం చేశారు. 82 ఏళ్ల వయసులో 2014 ఏప్రిల్ 14న తుదిశ్వాస విడిచే వరకూ తన ఇంటినే సైన్స్ గ్రంథాలయంగా నడిపారు.
కవితా రావు ఇంగ్లిష్ రచన లేడీ డాక్టర్స్ పుస్తకాన్ని కాకినాడకు చెందిన డాక్టర్ పీఎస్ ప్రకాశరావు అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆనందిబాయి, కాదంబినీ గంగూలీ, రుక్మాబాయి రౌత్, హైమవతి సేన్, ముత్తు లక్ష్మీరెడ్డి, మేరీ పూనాన్ లూకోస్.. వైద్య వృత్తిని చేపట్టే క్రమంలో ఎదుర్కొన్న సామాజిక, సాహసోపేతమైన ఘటనలెన్నో ఆలోచింపజేస్తాయి. ఈ నెలలో ‘పరిచయాలు–సమీక్షలు’ పేరుతో మరో పుస్తకాన్ని తీసుకొచ్చారు.
కాకినాడకు చెందిన రావు కృష్ణారావు మానవ సమాజ పరిణామ క్రమాన్ని నిర్దేశించే చలన సూత్రాలను విశ్లేషిస్తూ అనేక రచనలు చేశారు. రామచంద్రపురంలోని డాక్టర్ చెలికాని రామారావు స్మారక సమితి నిర్వాహకుడు డాక్టర్ చెలికాని స్టాలిన్ ప్రోత్సాహంతో ఈయన రచనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఆధునిక బేతాళ కథలు, బతుకు పోరు కథా సంకలనం పుస్తకాలు తెలుగు పాఠకులను ఆలోచింపజేశాయి.
కాకినాడ జిల్లా జగన్నాథగిరికి చెందిన ప్రజా నాట్యమండలి నాటక కళాకారుడు పోలిశెట్టి రామకృష్ణ తన భార్య జ్ఞాపకార్థం ఏడాదికో పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. పోలిశెట్టి అమ్మాజీ స్మారక సమితి పేరుతో సొంత ఖర్చులతో గత కాలపు ప్రఖ్యాత పుస్తకాలను ఆధునిక సాంకేతికతతో అచ్చు వేయించి ఉచితంగా అందజేస్తున్నారు.

పుస్తకం.. మహోన్నతం