
చేబ్రోలులో వ్యాధుల విజృంభణ
● వాంతులు, విరేచనాలతో పలువురికి అస్వస్థత ● ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు ● గ్రామంలో వైద్య సిబ్బంది సర్వే
పిఠాపురం: గొల్లప్రోలు మండలం చేబ్రోలులో రోగాలు ప్రబలి పలువురు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, కీళ్ల నొప్పులు, రొంప, జలుబు, దగ్గు వంటి వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేబ్రోలు ప్రభుత్వ ఆస్పత్రితో పాటు గొల్లప్రోలు, పిఠాపురాల్లోని ప్రైవేటు ఆస్పత్రులలో వీరందరూ చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు వైద్య సిబ్బంది గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి బాధితులకు చికిత్స అందిస్తున్నామని పీహెచ్సీ వైద్యుడు జగదీష్ తెలిపారు.
కారణమేమిటో!
ఇటీవల పక్క మండలంలో జరిగిన ఒక శుభ కార్యానికి వెళ్లిన కొందరు అస్వస్థతకు గురయ్యారు. అలాగే గ్రామంలో జరిగిన వివిధ శుభకార్యాలలో భోజనాలు చేసిన వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో ఫుడ్ పాయిజన్ కావడమే దీనికి కారణమని భావిస్తున్నారు. స్థానికంగా వేసిన కొత్త బోరులోని నీరు తాగడం వల్ల వ్యాధులు ప్రబలాయని మరికొందరు చెబుతున్నారు. దీంతో ఆ నీటికి పరీక్షలు చేయించిన వైద్యాధికారులు, నీటి వల్ల కాదని చెబుతున్నారు. మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల ఇలా జరిగి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. గ్రామంలో సుమారు వంద మంది అనారోగ్యానికి గురైనట్టు గుర్తించామని వైద్య సిబ్బంది చెబుతుండగా, వారి సంఖ్య మరో వంద వరకూ ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. వాతావరణ మార్పులు, ఎండల తీవ్రత వల్ల కూడా ఇలా రోగాలు విజృంభించే అవకాశం ఉందని వైద్యాధికారులు అన్నారు. కాగా.. గ్రామంలో వ్యాధుల విజృంభణపై జెడ్పీటీసీ ఉలవకాయల నాగ లోవరాజు వైద్యులను ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

చేబ్రోలులో వ్యాధుల విజృంభణ