
పీఎంఏవై గృహ సముదాయాల్లో మౌలిక వసతులు
కాకినాడ సిటీ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) తొలి విడతలో పేదలకు నిర్మించిన అన్ని కాలనీలు, టిడ్కో గృహ సముదాయాల్లో విద్యుత్, తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మౌలిక సదుపాయాల కల్పన పనులకు చెల్లించాల్సిన బిల్లులు, పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల వివరాలతో శాఖల వారీగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
జల్ జీవన్ మిషన్ ద్వారా అన్ని కాలనీల్లో పైపులైన్లు, పూర్తయిన గృహాలకు కుళాయిలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని కాలనీల్లో పచ్చదనం పెంపొందించేందుకు డ్వామా ద్వారా మొక్కలు నాటాలన్నారు. అన్ని కాలనీల్లో అంతర్గత విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి, దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. రెవెన్యూ శాఖ ద్వారా జరిపిన భూసేకరణ, డ్వామా, హౌసింగ్ శాఖల ద్వారా చేసిన ల్యాండ్ లెవెలింగ్ పనులకు చెల్లించాల్సిన మొత్తాల మంజురుపై ప్రభుత్వాన్ని కోరేందుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణను ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ పి.వెంకటలక్ష్మి, ఈపీడీసీఎల్ ఎస్ఈ డి.ప్రసాద్, మెప్మా పీడీ ప్రియంవద, ఎల్డీఎం జేఎస్వీఎస్ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.