
గంజాయి కేసులో నలుగురి అరెస్ట్
తుని: యువతకు గంజాయి సరఫరా చేస్తోన్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని తుని పట్టణ సీఐ ఎం.గీతారామకృష్ణ సోమవారం తెలిపారు. తునిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు ఉప్పరగూడెం కాలనీలో ముమ్మర తనిఖీలు నిర్వహించి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తుని పట్టణం అమ్మాజీపేటకు చెందిన పగడం శివ సంతోష్ ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి తునికి తీసుకువచ్చి బత్తాయితోట వీధికి చెందిన పిట్టా నాగ సత్య మహేష్, అమ్మాజీపేటకు చెందిన మనసాని వెంకటేష్ ద్వారా స్థానికంగా గంజాయి విక్రయిస్తున్నారన్నారు. వీరు ఉప్పరగూడెంకు చెందిన షేక్ ఉమా గౌరి వద్ద నిల్వ చేశారన్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించారని సీఐ తెలిపారు.
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
తొండంగి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తొండంగి మండలం ఏ.కొత్తపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన విశ్వనాథుల చిన్న(35) ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఆదివారం రాత్రి ఇంటి మేడపై పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతనిని చూసి కుటుంబ సభ్యులు తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీనిపై తొండంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సుమారు నెలరోజులకు బయటపడిన వైనం
కొవ్వూరు: మద్దూరులంక గ్రామంలో పల్లెపాలెంలో ఆకుల కృష్ణారావు అనే రైతుకి చెందిన మకాం సమీపంలో చిత్రాపు వెంకట్రావు మృతదేహాన్ని గుర్తించారు. సుమారు నెల రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని రూరల్ పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా ఎండిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి. రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు ఘటనా స్ధలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఆరునెలలు క్రితమే మృతుడు వెంకట్రావు భార్య రామజ్యోతి తొమ్మిది నెలలు గర్భవతిగా ఉన్న సమయంలో గుండె పోటుతో మృతి చెందారు. అప్పటి నుంచి వెంకట్రావు ఒంటరిగా ఉంటున్నారు. గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఎస్సై చెప్పారు. ఆమె ఇటీవల హైదరాబాద్ వెళ్లిపోయింది. వెంకట్రావు తల్లిదండ్రులు పదిహేహేనేళ్ల కిత్రమే మృతి చెందారు. దీంతో తన సోదరుడు ఒక ఫోర్షన్లోను వెంకట్రావు మరో పోర్షన్లోను నివాసం ఉంటున్నారు. అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకోవడం లేదని స్ధానికులు చెబుతున్నారు. ఘటనా స్ధలంలో లభ్యమైన మొబైల్ ఫోన్ ఆధారంగా శవం వెంకట్రావుది అని నిర్ధారించారు. మార్చి 20వ తేదీన చివరి కాల్ చేసి ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలంలో లభ్యమైన సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహానికి సమీపంలోనే గుళికలు డబ్బా ఉండడాన్ని బట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. వెంకట్రావు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్య చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. దీంతో అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీహరిరావు తెలిపారు.