
విద్యార్థి జీవితంలో పుస్తకానికి ప్రాధాన్యం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రతి విద్యార్థి జీవితంలో పుస్తకం ప్రాధాన్యం కలిగి ఉంటుందని ప్రముఖ విద్యావేత్త అమలారాయ్ పేర్కొన్నారు. కాకినాడ సురేష్నగర్ శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో సోమవారం 2024–25 విద్యాసంవత్సరంలో విద్యతో పాటు పలు విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం పేరుతో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అమలారాయ్ మాట్లాడుతూ విద్య అంటే తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పినది వినడం, పుస్తకాలు పఠనం చేయడం మాత్రమే కాదని, మానసిక వికాసం కోసం ఉల్లాసం కోసం మనం ఆడే ఆటలు, పాటలు అన్నీ విద్యాభ్యాసమేనన్నారు. నేటి కాలంలో విధ్యాభ్యాసం కేవలం మార్కులు, ర్యాంకులు సాధనే ధ్యేయంగా మారిందని, ఇటువంటి సమయంలో విద్యతో పాటు సమానంగా వారికి అభిరుచి ఉన్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీ ప్రకాష్ యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పాఠశాల డైరక్టర్ సీహెచ్.విజయ ప్రకాష్ మాట్లాడుతూ విద్యాబోధన కంటే చదువుపై ఆసక్తిని కలిగించడం విద్యాసంస్థల ప్రధమ కర్తవ్యమన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి స్మార్ట్ షేక్స్పియర్, సూపర్ స్పిల్బర్గ్, రాకింగ్ రామానుజన్, పద్యయోధ టైటిల్స్ అందజేశారు.