
రత్నగిరిపై భక్తుల రద్దీ
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
● 2,100 వ్రతాల నిర్వహణ
● రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం రద్దీగా మారింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులకు ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని మొత్తం 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సెలవు దినం కావడంతో రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగించనున్నారు.
ఘనంగా ప్రాకార సేవ
సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి, తిరుచ్చి వాహనంపై వేంచేయించారు. పూజల అనంతరం అర్చకులు ప్రాకార సేవ ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల ఘోష నడుమ ఆలయ ప్రాకారంలో మూడుసార్లు సేవ నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పండితులు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. వేద పండితులు చిట్టి శివ, అర్చకుడు కంచిభట్ల సాయిరామ్, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.