
మొదలైన పెళ్లి సందడి
● సత్యదేవుని రథానికి మరమ్మతులు
● 23న ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశం
అన్నవరం: వచ్చే నెల 7 నుంచి జరగనున్న సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల ఏర్పాట్లు ఎట్టకేలకు మొదలయ్యాయి. కల్యాణ ఘడియలు సమీపిస్తున్నా ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు కాలేదని పేర్కొంటూ ‘కానరాని పెళ్లి సందడి’ శీర్షికన ‘సాక్షి’ శనివారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. కల్యాణోత్సవాల్లో భాగంగా వచ్చే నెల 11న నిర్వహించే రథోత్సవంలో ఉపయోగించే రథం ముసుగు తొలగించి, మరమ్మతులు ప్రారంభించారు. ఈ రథం తయారు చేసిన మురమళ్లకు చెందిన కొల్లాటి శ్రీనివాస్ను, మరో నలుగురు శిల్పులను రప్పించారు. వారు రథానికి ఉన్న ఆరు చక్రాల ఇరుసులకు గ్రీజు పెట్టి, వాటి పనితీరు పరిశీలించారు. చక్రాల అడుగున నలుపు రంగు వేశారు. బ్రేకుల పనితీరు పరిశీలించి, రథాన్ని శుభ్రం చేసి, ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ పనులన్నింటికీ నాలుగు రోజులు పడుతుందని శ్రీనివాస్ తెలిపారు. హైడ్రాలిక్ బ్రేకుల పనితీరును పరిశీలించేందుకు రెండు మూడు రోజుల్లో నిపుణులు వస్తారని చెప్పారు. అలాగే, కోరుకొండ రథోత్సవం నిర్వహణలో అనుభవజ్ఞులైన 30 మంది నిపుణులను కూడా సత్యదేవుని రథోత్సవానికి రప్పిస్తున్నారు. రథానికి కట్టే పగ్గాలను కూడా తాళ్లరేవు నుంచి తీసుకుని వచ్చారు. కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై ఈ నెల 23న దేవస్థానం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్సవాలకు సంబంధించి గత నెలలో దేవస్థానం అధికారుల అంతర్గత సమావేశంలో చర్చించిన అంశాలు, ప్రభుత్వ విభాగాలు అందించాల్సిన సహకారంపై రూపొందించిన మినిట్స్ను ఈఓ వీర్ల సుబ్బారావు శనివారం పరిశీలించారు. సమన్వయ సమావేశానికి హాజరు కావాల్సిందిగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సమాచారం పంపించారు. కలెక్టర్ షణ్మోహన్ను కూడా ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు సమాచారం.

మొదలైన పెళ్లి సందడి