
కిటకిటలాడిన తొలి తిరుపతి
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయం వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో శనివారం కిటకిటలాడింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. వివిధ సేవలు, కేశఖండన టికెట్లు, అన్నదాన విరాళాలుగా స్వామివారికి రూ.2,91,596 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామని చెప్పారు.
రేపు ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
తుని రూరల్: హంసవరంలోని ఏపీ మోడల్ స్కూల్లో ఆరో తరగతిలో చేరికకు సోమవారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ పుల్లా పద్మజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ ఈ పరీక్ష జరుగుతుందన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్లోనే హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాలన్నారు. హాల్ టికెట్, ఆధార్ నకలు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, బ్లాక్ లేదా బ్లూ పెన్నులతో పరీక్షకు సకాలంలో హాజరు కావాలని సూచించారు.
కలెక్టరేట్లో రేపు పీజీఆర్ఎస్
కాకినాడ సిటీ: కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకూ జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.
జిల్లా ఇంటర్మీడియెట్
విద్యాశాఖాధికారిగా శారద
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారిగా ఐ.శారద శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ పని చేసిన నూకరాజు గత మార్చి 30న ఉద్యోగ విరమణ చేశారు. మామిడికుదురుకు చెందిన ఏసుబాబును జిల్లా అధికారిగా నియమించగా ఆయన రెండు వారాల పాటు పని చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేయనున్నందున ఈ బాధ్యతలు నుంచి తనను తొలగించాలని ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో ఆయనను రిలీవ్ చేసి, జోన్–2 ఆర్జేడీగా ఉన్న శారదను ఈ పోస్టులో నియమించారు. ఈ సందర్భంగా శారదను పీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతుల రాంబాబు, ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ మావూరి తిరుపతిరెడ్డి, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాల్స్, సిబ్బంది అభినందించారు. అందరి సహాయ సహకారాలతో జిల్లాలో ఇంటర్ అడ్మిషన్ల పెంపుదలతో పాటు మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తానని శారద చెప్పారు.