రత్నగిరి వివాదాలపై విచారణ | - | Sakshi
Sakshi News home page

రత్నగిరి వివాదాలపై విచారణ

Apr 20 2025 12:15 AM | Updated on Apr 21 2025 1:04 PM

రత్నగిరి వివాదాలపై విచారణ

రత్నగిరి వివాదాలపై విచారణ

అదనపు కమిషనర్‌ చంద్రకుమార్‌కు దేవదాయ కమిషనర్‌ ఆదేశం

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఇటీవల ఏర్పడిన పలు వివాదాలపై విచారణ జరిపేందుకు దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విచారణ జరిపి నివేదిక అందజేయాలని దేవదాయ శాఖ అదనపు కమిషనర్‌ కె.చంద్రకుమార్‌కు శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. చంద్రకుమార్‌ కూడా కొన్ని రోజులు అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేశారు. కొంత కాలంగా దేవస్థానంలో ఈఓ వీర్ల సుబ్బారావు తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 

ఆయన కుమారుడు దేవస్థానంలోని పలు విభాగాలను పరిశీలిస్తూ సిబ్బందికి ఆదేశాలివ్వడం, ఈఓ కార్యాలయంలో జరిగిన డ్రోన్‌ కెమెరాల కొనుగోలు సమావేశంలో ఆయనతో పాటు పాల్గొని, అధికారులకు సూచనలివ్వడంపై వివాదం రేగింది. ఈఓ వ్యవహార శైలిపై ఆవేదన చెందిన ఇద్దరు అధికారులు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయడం, మరికొంత మంది సెలవుపై వెళ్లడం విదితమే. వరుసగా జరిగిన ఈ వివాదాలపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దేవస్థానం వ్యవహారాల్లో ఈఓ కుమారుడు జోక్యంపై మంగళవారం ప్రచురితమైన ‘చినబాబు వచ్చారు.. బహుపరాక్‌’ కథనం తీవ్ర సంచలనం రేకెత్తించింది. 

ఆ రోజు విశాఖపట్నంలో సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం సమావేశంలో పాల్గొన్న దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ్‌నారాయణరెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్ల సమావేశంలో కూడా ఈ కథనం ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపించాలని మంత్రి ఆదేశించడంతో కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement