బత్తాయి రైతులు మూడేళ్లుగా గిట్టుబాటు ధరలు పొందలేదు. ఈఏడాదిలో మాత్రం వస్తున్న ధరలతో ఊరట చెందుతున్నారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో ఇక్కడి రైతులు కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తారు. ఏప్రిల్ మొదటి వారంలో టన్నుకు రూ. 18వేల నుంచి రూ. 20వేల ధర రాగా.. రెండో వారం నుంచి కాస్త పెరిగి, రూ. 20వేల నుంచి రూ. 25వేల వరకు ధర వచ్చింది. మూడు, నాలుగో వారంలో మరింత పెరిగాయి. ఆ తర్వాత రూ. 25వేల నుంచి రూ. 35వేల వరకు చేరింది. ఈ నెలలో మార్కెట్లో మరోసారి ధరలు పెరిగాయి. ఈ నెలలో కాయసైజు, నాణ్యత బాగా ఉంటే టన్నుకు రూ. 40వేల నుంచి రూ. 55వేల వరకు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న ధరలు బత్తాయి రైతుకు ఊరటనిస్తున్నాయి. టన్నుకు కనీసం రూ. 30వేల నుంచి రూ. 35వేలు వస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. ఇదిలా ఉంటే, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున బత్తాయికి డిమాండ్ పెరిగి.. మంచి ధరలు వస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


