ఇటిక్యాల: బీచుపల్లి పుణ్యక్షేత్రం శనివారం ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగింది. నెలరోజులపాటు జరిగే జాతర ఉత్సవాలలో భాగంగా రెండోవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా బీచుపల్లికి చేరుకొని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. భక్తులు దాసంగాలతో మట్టి కుండలలో ప్రత్యేక నైవేద్యం వండి ఆంజనేయస్వామికి సమర్పించారు. అనంతరం ద్వజస్తంభం ఎదుట కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శివాలయంలోనూ భక్తులు పూజలు చేశారు.


