వైద్యశాఖలో అలజడి | - | Sakshi
Sakshi News home page

వైద్యశాఖలో అలజడి

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో గందరగోళం సృష్టించిన ఉద్యోగుల నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలతో కాంట్రాక్టు ఉద్యోగాలు పొందారంటూ తరుచూ కలెక్టరేట్‌ ప్రజావాణికి ఫిర్యాదులు అందడంతో కలెక్టర్‌ స్పందించి విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు నకిలీ ధ్రువపత్రాలతో కొన్ని నెలలుగా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేశారని, విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డా. సాయినాథ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. కష్టపడి చదివి తెచ్చుకున్న విద్యార్హతను నకిలీగా చిత్రీకరించి ఉద్దేశపూర్వకంగా తన పరువుకు భంగం కలిగించారంటూ వారిలో ఒకరైన శిరీష డీఎంహెచ్‌ఓపై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేశారు. ఇటీవల వనపర్తి కోర్టు ఈ దావాను స్వీకరించినట్లు తెలిసింది. 2026, జూన్‌ 12న కోర్టుకు హాజరుకావాలని తెలిపినట్లు సమాచారం. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం పొంది ఉంటే తీసుకున్న వేతన రికవరీకి ఎందుకు ఉపక్రమించలేదని, యూనివర్సిటీ డిక్లరేషన్‌ కాపీ ఎందుకు బయటపెట్టడం లేదనే అంశాలు వైద్య, ఆరోగ్యశాఖలో సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయాన్ని డీఎంహెచ్‌ఓ డా. సాయినాథ్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా.. అదంతా గడిచిపోయిన విషయమని, చట్టప్రకారం వెళ్తున్నామని, ఎక్కువగా మాట్లాడటం సరికాదని బదులిచ్చారు.

జిల్లా వైద్యాధికారిపై పరువునష్టం దావా

Advertisement
 
Advertisement
Advertisement