
బీచుపల్లిలో ముగిసిన పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు
ఎర్రవల్లి: శ్రీరామ నవమిని పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో నిర్వహించిన పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, యాగశాల చతుస్థానార్చన, చక్రస్నానం, మహా పూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ వంటి పూజలు చేశారు. సాయంత్రం ద్వాదశారాధన, శ్రీపుష్పయాగం, ధ్వజావరోహణం, వేద ఆశీర్వచనం కార్యక్రమాలను వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
కాంట్రాక్టు లెక్చరర్లను
రెగ్యులరైజ్ చేయాలి
గద్వాలటౌన్: పాలమూరు యూనివర్సిటీ పరిఽఽధిలోని గద్వాల ప్రభుత్వ పీజీ సెంటర్లో మంగళవారం కాంట్రాక్టు అధ్యాపకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జీఓ 21ని వ్యతిరేకిస్తూ తరగతులను బహిష్కరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రిన్సిపల్ వెంకటరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 21తో కాంట్రాక్టు, పార్ట్టైం అధ్యాపకుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని.. పార్ట్టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మంగళగిరి శ్రీనివాసులు, మహేందర్, గోపినాథ్ రాథోడ్, వంగూరి గణేశ్ పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.5,949
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 1,695 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ. 5,949, కనిష్టంగా రూ. 3,069, సరాసరి రూ. 5,199 ధరలు వచ్చాయి. 36 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,529, కనిష్టంగా రూ. 6,009, సరాసరి రూ. 6,529 ధరలు లభించాయి. 40 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,009, కనిష్టంగా రూ. 5,661 ధర పలికింది. 424 క్వింటాళ్ల వరిధాన్యం (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,030, కనిష్టంగా రూ. 1,759, సరాసరి రూ. 2,019 ధరలు లభించాయి.

బీచుపల్లిలో ముగిసిన పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు