భూపాలపల్లి అర్బన్: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహుల్శర్మ పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని, హమాలీలు, గన్నీ సంచులు, రవాణా వాహనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన చేసి రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని సూచించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ, పౌర సరఫరాలు సంస్థ, సహకార, వ్యవసాయ, ఆర్డీఓ అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, మక్కలు జిల్లాకు రాకుండా చెక్పోస్టు వద్ద పర్యవేక్షించాలన్నారు. లారీల కొరత ఉన్నచోట ట్రాక్టర్లు వినియోగించుకోవాలని సూచించారు. హమాలీల కొరత ఉంటే స్థానికంగా అందుబాటులో ఉన్న హమాలీలను వినియోగించుకోవాలని సూచించారు. అధికారులందరూ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ధాన్యం, మక్కలు కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సహకార అధికారి వాలియా నాయక్, వ్యవసాయ అధికారి బాబురావు, పౌర సరఫరాల అధికారి కిరణ్కుమార్, డీఎం రాములు, డీఆర్డీఓ బాలకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
వీసీలో సీఎం రేవంత్ రెడ్డి


