● 21నుంచి సరస్వతీనది అంత్య పుష్కరాలు
● పనుల్లో నాణ్యత లోపిస్తుందని విమర్శలు
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. కాళేశ్వరంలో పురాతన విగ్రహాలు అమర్చడానికి రూ.1.20కోట్ల వ్యయంతో మ్యూజియం పనులు వేగిరంగా జరుగుతున్నాయి. ఈనెల 18 వరకు పూర్తి చేయాలని అఽధికారులు ఆదేశించారు. దీంతో వేగిరంగా పనులు చేస్తూ.. నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.30లక్షల వ్యయంతో నాగదేవాలయం నిర్మాణం కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ఈ రెండు పనులపై రిటైర్డు డీఈ, ఏఈఈలు పర్యవేక్షణకు ఉన్నప్పటికీ గడువులోగా పూర్తయ్యేలా లేదు. క్యూరింగ్ కూడా సరిగ్గా జరుగడం లేదు. రూ.2కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులు కూడా నెమ్మదిగా ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పరీక్షలు జరుపాలని భక్తులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో చూడకపోవడంతో నాణ్యత లోపిస్తుందనే విమర్శలు వస్తున్నాయి.
పొలం గట్లు పొట్టు పొట్టు!
పార్కింగ్ స్థలాల కోసం అధికారులు రైతుల పంట భూములను చదును చేయడం వివాదాస్పదమైంది. పడిదం చెరువు కింది ఆయకట్ట రైతుల సమాచారం ప్రకారం.. ముందస్తు సమాచారం లేకుండా డోజర్లతో గట్లు దున్ని భూములను చదును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పొలం గట్టు ఎక్కడ ఉందో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. భూములు దెబ్బతిన్న రైతులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. నష్టపరిహారంగా ఎకరానికి రూ.20 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.


