ములుగు:/ములుగు రూరల్: ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ మహేందర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు నిర్వహించే ఇళ్ల గణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. అన్ని స్థాయిల్లో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. 10వ తేదీలోపు వారికి మెటీరియల్ కిట్లు, గుర్తింపు కార్డులు అందజేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో 11వ తేదీ నుంచి ఇళ్ల గణనకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విధులు నిర్వహించే సిబ్బందికి సైతం శిక్షణ పూర్తి అయిందని వివరించారు. స్వీయ గణనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
వీసీలో రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి


