కాళేఽశ్వరం: మహదేవపూర్ మండలంలో మంగళవారం అర్ధరాత్రి అకాల వర్షం కురిసింది. దీంతో మహదేవపూర్, సూరారం, ఎలికేశ్వరం, బొమ్మాపూర్లోని వరిధాన్యం కొసుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించిన కష్టం వరద నీ టి పాలైందని విలపిస్తున్నారు. మహదేవపూర్ డిగ్రీ కాలేజీ గ్రౌండులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వర్షపు నీరు చేరింది. దీంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానాతంటాలు పడ్డారు. సుమారుగా 1000 బస్తాలు తడిశాయి.
వరద నీటితో అప్పుల పాలు
యాసంగిలో అకాల వర్షం కురిసి అప్పుడు పంట నష్టపోయా. ఇప్పుడు మూడెకరాలు కౌలుకు తీసుకుని రూ.లక్ష వరకు అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టిన. మంగళవారం రాత్రి వర్షం దంచి కొట్టింది. కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. అప్పులు ఎలా తీర్చాలి. ప్రభుత్వం ఆదుకోవాలి.
– గోస్కుల బొందయ్య,
మహదేవపూర్, కౌలు రైతు


