మల్హర్(కాటారం): కాటారంలో కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ బస్టాండ్ భూముల పరిరక్షణతో పాటు నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి చొరవ చూపాలని వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ భవానిప్రసాద్ను డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు కోరారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశాల మేరకు సోమవారం వరంగల్లో ఆర్ఎం, భూపాలపల్లి డీఎం సంబంధిత అధికారులకు కాటారం ప్రయాణ ప్రాంగణ స్థలం నిర్మాణంపై నాయకులు వినతి పత్రం అందించారు. కోర్టులో కేసు నడుస్తునందున రాష్ట్ర లీగల్ సెల్ను అప్రమత్తం చేసి క్లియరెన్స్ తెప్పిస్తే మంత్రి శ్రీధర్బాబు బస్స్టేషన్ నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులకు వివరించారు. బస్స్టేషన్ నిర్మాణం, కాంపౌండ్ వాల్ ఏర్పాటుకు ఆర్టీసీ నాయకులు లీగల్ సెల్ ద్వారా క్లియరెన్స్ సర్టిఫికెట్స్, టెండర్ ప్రాసెస్ వెంటనే నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధన్వాడ మాజీ ఎంపీటీసీ కుమ్మరి అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మకూరి కుమార్, పున్నం రమేష్ పాల్గొన్నారు.


