దేవతామూర్తుల వేదాశీర్వచనం తీసుకుంటున్న బ్రహ్మోత్సవాల యాగ్నికులు
వనదేవత(దైత) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్న యాగ్నికులు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం రాత్రి సదస్యం(వేదాశీర్వచనం) కార్యక్రమాన్ని యాగ్నికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల(జాతర) కార్యక్రమాల్లో భాగంగా ఏడోరోజు ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి ఎం. వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం ఉదయం ఆలయంలో స్వయంభు స్వామివారి నిత్యారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన, ఆలయ ప్రాంగణంలోని వనదేవత(దైత) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం(స్నపనం), మహానివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు హయగ్రీవ స్తోత్ర పారాయణం, హవనం, చతుస్థానార్చన, బలిహరణ, స్వామివారి కల్యాణ మండపంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, అమ్మవార్లకు సదస్యం (వేదాశీర్వచనం) కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవకమిటీ చైర్మన్ సురేశ్, ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్ శర్మ, కారంపుడి పవన్కుమార్, ఏడునూతుల ఈశ్వర్చంద్, అనిపెద్ది రాజీవ్శర్మ, యాగ్నికులు పెరంబదూర్ మధనమోహనాచార్యులు, శ్రీకృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు. బరద్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహా చార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ సీనియర్ అసిస్టెంట్ న్యాతని సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
ఏడోరోజు హేమాచలక్షేత్రంలో సదస్యం
వనదేవత (దైత)అమ్మవారికి స్నపనం


