మల్హర్(కాటారం): నేడు(సోమవారం) కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ హరికృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్తో పాటు రెవెన్యూ డివిజనల్ స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు నేడు సబ్కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు వారి సమస్యకు సంబంధించిన అంశంపై లిఖిత పూర్వక దరఖాస్తు ఇవ్వాలని ఆయన సూచించారు.
యువత ఉద్యమించాలి
భూపాలపల్లి అర్బన్: ప్రజా సమస్యలపై యువత ఉద్యమించాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురయ్య భవనంలో ఆయన పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. 1959 మే 3న స్థాపించబడిన ఏఐవైఎఫ్ నాటి నుంచి నేటి వరకు యువత హక్కుల కోసం పోరాడుతోందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని, చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తూ నిరుద్యోగుల భవిష్యత్తో ఆడుకుంటున్న పాలకులకు యువత తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ‘అందరికీ పని–అందరికీ విద్య’ లక్ష్యం సాధించే వరకు ఏఐవైఎఫ్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు సులభంగా లభిస్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి లేక నిరాశలో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా విస్తరిస్తోందని అన్నారు. మత్తు అలవాట్లకు దూరంగా ఉండి యువత తమ భవిష్యత్ను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్, సహాయ కార్యదర్శి కృష్ణ, ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి క్యాతరాజు సతీష్ పాల్గొన్నారు.


