మల్హర్: ఽరైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా సహకార అధికారి వాల్యనాయక్ అన్నారు. కాటారం మండలంలోని కాటారం, కొత్తపల్లి శంకరంపల్లి, ధన్వాడ సెంటర్లను కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, సర్పంచ్లతో కలిసి వాల్యనాయక్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ.. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు సెంటర్ల వద్ద మౌలిక వసతుల కల్పనతో పాటు నగదు జమ అయ్యేవరకు సంబంధిత వ్యవసాయ అధికార యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పీఏసీఎస్ ప్రత్యేక అధికారి రాజు, సీఈఓ ఎడ్ల సతీష్ సర్పంచ్లు పంతకాని సడవలి, సర్పంచ్ అజ్మీర కిషన్నాయక్, మహేష్కుమార్, అరుణస్వామి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు
ఘన సన్మానం
భూపాలపల్లి అర్బన్: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను శనివారం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవి అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా సాయి చరణ్ 540, ఎండీ హఫీజ్ 534, ఎస్.హర్షవర్ధన్ 529, సాయి వరుణ్ 508, టి.అభిలాష్ 508, నవాజుద్దీన్ 502 ఉత్తమ ఫలితాలు సాధించగా కోఆర్డినేటర్ రాజశేఖర్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను శాలువాలు, మొమెంటోలతో ఘనంగా సన్మానించారు.
12న తెలంగాణ జనసమితి ప్లీనరీ
భూపాలపల్లి రూరల్: ఈనెల 12న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్లో నిర్వహించనున్న తెలంగాణ జన సమితి నాలుగో రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రత్నం కిరణ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రత్నం కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు తెలంగాణ జన సమితి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, పార్టీ నాయకులు దాసరి జనార్దన్, రాళ్లపల్లి బాపు, నామాల శ్రీనివాస్, కాసర్ల ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు.
మొక్కజొన్న
పంట దగ్ధం
చిట్యాల: చిట్యాల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గోపగాని చిన్న వెంకన్న, గోపగాని రవీందర్, ఆరెల్లి కృష్ణమూర్తి, గోపగాని ఆనందం, మేరుగు ప్రభాకర్కు చెందిన మొక్కజొన్న పంటలు శనివారం ప్రమాదవశాత్తు కాలిపోయాయి. సుమారు 14 ఎకరాల్లో వేసిన పంట అగ్నికి ఆహుతి అయినట్లు బాధిత రైతులు విలపించారు. 120 పైపులు పూర్తిగా కాలిపోయినట్లు వారు పేర్కొన్నారు. ఈప్రమాదంలో సుమారు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.
యువకుడి ఆత్మహత్య
కాళేశ్వరం: తమ్మెట గుళికలు తిని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహదేవపూర్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహదేవపూర్ గ్రామం నేతకానివాడకు చెందిన చిలుమల శ్రీనివాస్ (35)కు భార్యతో మనస్పర్ధలు ఉన్నాయి. సంవత్సరం క్రితం భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. దీంతో శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో తుమ్మెట గుళికలు తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతిచెందాడు. మృతుడి సోదరుడు రామచంద్రం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


