హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు గురువారం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. చూర్ణోత్సవం జరిపి చక్రతీర్థోత్సవం నిర్వహించి తిరిగి చక్రాన్ని అమ్మవారి సన్నిధికి చేర్చారు. అనంతరం పూర్ణాహుతి, బలిహరణ, ధ్వజావరోహణంతో ఉత్సవాలు సమాప్తం చేశారు.
అమ్మవారికి పుష్పయాగం
అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి స్నపనమందిరంలో అమ్మవారికి వేదపండితులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా రంగురంగుల గులాబీలు, మల్లెలు, లిల్లీలు, విరజాజులు, బంతులు, చామంతులు, కనకాంబరాలు తదితరపూలతో ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. పుష్పయాగం నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోషాలు తొలగిపోతాయని భద్రకాళి శేషు తెలిపారు.


