చిన్నారులకు మిల్క్
ఏటూరునాగారం: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు చిక్కటి పాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ మేరకు గత నెల 17వ తేదీన పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు రోజుకూ 100 ఎంఎల్ చిక్కటి పాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా 549 ప్రధాన అంగన్వాడీ సెంటర్లు ఉండగా 91 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల పిల్లలు 8,273 మంది ఉండగా ఈ పథకం ద్వారా పాలను అందిస్తున్నారు. దీంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా సెంటర్ల నిర్వహకులు చూస్తున్నారు.
పాలతో ప్రొటీన్స్
ప్రతిరోజూ 100 ఎంఎల్ చిక్కటి పాలను చిన్నారులు తాగడం వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా ఉంటాయి. పాలలో ఉండే కాల్షియం, భాస్వరం, విటమిన్ డీతో పాటు ఏ విటమిన్ వంటి పోషకాలు చిన్నారులకు అంది చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. అంతే కాకుండా ప్రొటీన్స్, విటమిన్లతో పాటు పొటాషియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తాయి. అలాగే అధిక బరువు పెరగకుండా చూస్తాయి. చిన్నారులకు పాలతో పాటు మహాలక్ష్మీ పథకం కింద కోడిగుడ్డు, అన్నం, కురుకురేలు, బాలామృతం, బాలామృతం ఫ్లస్ వంటివి కూడా అంగన్వాడీ టీచర్లు అందజేస్తున్నారు.
పాలు అందుతున్నాయి..
ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రంలో 100 ఎంఎల్ పాలు ఇస్తున్నారు. రోజు అంగన్వాడీ కేంద్రానికి తీసుకొచ్చి వదిలిపెడితే పిల్లలకు టీచర్లు పాలు ఇవ్వడంతో పాటు ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్నారు. దీనివల్ల ఏజెన్సీ గ్రామాల్లోని పిల్లలకు మరింత మేలు జరుగుతుంది. పిల్లలు కూడా అంగన్వాడీ బడికి రావడానికి ఇష్టపడుతున్నారు.
– ఎట్టి మానస, చిన్నబోయినపల్లి, తల్లి
అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు పంపిణీ
పైలెట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా ఎంపిక
గత నెల 17న లాంఛనంగా పథకాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
జిల్లాలో 8,273 మంది పిల్లలు
జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లు, చిన్నారుల వివరాలు
ప్రాజెక్టులు సెంటర్లు చిన్నారులు
ములుగు 142 2,536
ఎస్ఎస్ తాడ్వాయి 124 1,430
వెంకటాపురం(కె) 168 1,624
ఏటూరునాగారం 206 2,683
చిన్నారులకు మిల్క్
చిన్నారులకు మిల్క్


