
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి రూరల్: ప్రజారోగ్యంపై సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. భూపాలపల్లి మండలం ఆజాంనగర్ గ్రామంలో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు రూ.16 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్ర భవనం, రూ.14 లక్షలతో ప్రైమరీ హెల్త్ సెంటర్ను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మునుపెన్నడూ లేనివిధంగా ఆస్పత్రులకు నిధుల కేటాయింపులు, నియామకాలపై దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆస్పత్రిలో రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు. అన్ని వివరాలను సక్రమంగా రికార్డులో పొందుపరచాలని డాక్టర్లు, సిబ్బందికి సూచించారు. అనంతరం ఆజాంనగర్ గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తూరి ప్రవీణ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. పంబాపూర్ గ్రామంలోని భీమ్ ఘనపూర్ చెరువు నీటిని నీటిపారుదల శాఖ ఈఈ ప్రసాద్, అధికారులు, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే దిగువన ఉన్న పంట పొలాలకు విడుదల చేశారు.