
అధికారులు కాళేశ్వరంలోనే ఉండాలి
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతి నది పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా శనివారం నుంచి అధికారులు కాళేశ్వరంలోనే మకాం వేసి, అన్ని ఏర్పాట్లను సమీక్షించి పర్యవేక్షించాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. కాళేశ్వరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో జిల్లా అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని విభాగాలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆరోగ్య శిబిరాల ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన స్టేజీ, మైక్ ఇతర ఏర్పాట్లు, పారిశుద్ధ్య చర్యలు, సిబ్బందికి ఆహార ఏర్పాట్లపై పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఈఓ కార్యాలయంలో వైద్య సిబ్బందితో వైద్య సేవలు నిర్వహణపై సమావేశం నిర్వహించారు. మూడు షిఫ్ట్ల్లో విధులు నిర్వహించాలని ఆదేశించారు. అత్యవసర మందులు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. అత్యవసర సేవలకు మహాదేవపూర్లో 30 బెడ్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. అంబులెన్స్, 108 సేవలు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అనంతరం వీవీఐపీ ఘాట్లోని త్రివేణి సంగమం వద్ద గోదావరిలో నీటిమట్టాన్ని పరిశీలించారు. సీఎం రానున్న నేపథ్యంలో ముందస్తుగా రక్షణ చర్యలను పర్యవేక్షించారు. వర్షం వచ్చినా టెంట్ సిటీ వద్ద బురద కాకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా గ్రావెల్ వేయాలని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అడిషనల్ ఎస్పీ కిషన్, సీఐ రామచందర్రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, డీఎల్పీఓ వీర భద్రయ్య, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్నాయక్, డీఈఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు ఉన్నారు.
భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
కలెక్టర్ రాహుల్శర్మ