
వాహనాలు జరభద్రం..!
ఖిలా వరంగల్: వేసవిలో ఏ వాహనంలోనైనా ఇంధనాన్ని పూర్తిగా నింపొద్దు. ఎండ వేడికి ఇంజన్ ఆయిల్ త్వరగా పలుచబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజన్ ఆయిల్ను మార్చుకోవడం మంచిది. వాహన పెట్రోలు ట్యాంకుపై మందం కవర్ ఉండేలా చూసుకోవాలి. సీట్ల కవర్లు సాధారణమైనవి అయితే త్వరగా వేడెక్కి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకు ప్రత్యామ్నాయంగా వేడి కాకుండా ఉండేందుకు వెలివేట్ క్లాత్ వంటి సీటు కవరును వాడాలి. ఎండలో ఎక్కువ సమయం పార్కింగ్ చేసి ఉంచితే ద్విచక్రవాహనాలు దెబ్బతింటాయి. ఇంజన్లో మంటలు వస్తాయి. టైర్లు పేలుతాయి. ఎప్పటికప్పుడు కూలెంట్ ఆయిల్ చెక్చేసుకోవాలి. దూరప్రయాణం చేయాల్సిన వారు మధ్య మధ్యలో వాహనాలను ఆపి 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల వాహన ఇంజన్ వేడి తగ్గి కూల్ అవుతుంది. వాహనాలను ఎక్కువ సేపు పార్కింగ్ చేయాల్సి వస్తే చెట్టునీడన, షెడ్డుల్లో పార్కింగ్ చేయడం మంచిది. మధ్యాహ్నం 2గంటల నుంచి 4గంటల సమయంలో బైక్ ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది. ఎండ వేడికి టైర్లు మెత్తబడి గాలి తగ్గి, బైక్ మధ్యలోనే ఆగిపోతుంది. ఒక్కోసారి బైక్ టైర్లు పేలి అదుపు తప్పి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. వేసవిలో వాహనాల్లో బ్యాటరీపై ఎక్కువ లోడ్పడుతుంది. ఇదే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, పరిమితికి మించి వాహనంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలను బిగించడం వల్ల షార్ట్ సర్క్యూట్కు ఆస్కారం ఉంటుంది.
– ఎండీ జాఫర్, సీనియర్ మెకానిక్

వాహనాలు జరభద్రం..!