జనగామ రూరల్: స్పెషల్ లీవ్ పిటిషన్ వెనక్కి తీసుకొని 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కొల్ల మైపాల్రెడ్డి అధ్యక్షతన పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులైన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ‘ప్రతిభ అవార్డ్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. 2004కు ముందుగా నోటిఫికేషన్ విడుదలై అనంతరం నియమితులైన 2003ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57/4, 57/5లను జారీ చేసిందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆమరణ దీక్ష చేపడతానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి, రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, నూకల ఎల్లారెడ్డి పాల్గొన్నారు.
స్పెషల్ లీవ్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి
శ్రీపాల్ రెడ్డి


