నేడు మెగా జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

నేడు మెగా జాబ్‌మేళా

May 8 2026 12:19 PM | Updated on May 8 2026 12:19 PM

జనగామ: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) మెగా జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కె. కోదండ రాములు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియేట్‌ నుండి పోస్టు గాడ్యుయేషన్‌ వరకు విద్యార్హత కలిగిన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయన్నారు. ఈ నెల 8వ తేదీన హనుమకొండలోని బాలసముద్రం, కొత్త బస్టాండ్‌ సమీపంలోని కాళోజీ కళాక్షేత్రంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 91825 52593 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

మార్కెట్‌కు

రెండు రోజుల సెలవు

జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం, మక్కల నిల్వలు పేరుకుపోవడంతో వాటిన తరలించేందుకు ఏఎంసీకి ఈ నెల 8, 9వ తేదీల్లో రెండు రోజులు పాటు సెలవును ప్రకటించినట్లు చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరుకులను తరలించేం దుకు సరిపడా వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం, మక్కలు పేరుకు పోయాయన్నారు. రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించగా, 10వ తేదీన ఆదివారం కావడంతో రైతులు ఎవరూ కూడా మార్కెట్‌కు సరుకులను తీసుకురావద్దన్నారు. ఈ నెల 11వ తేదీన యదావిధిగా మార్కెట్‌ సేవలు పునఃప్రారంభమవుతాయన్నారు.

మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

జనగామ: మైనార్టీ విద్యార్థుల రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సీఎస్‌ఏటీ (సివిల్‌ సర్వీసెస్‌ అప్టిట్యూట్‌ టెస్ట్‌) 2026 పరీక్షకు ఉచిత శిక్షణను అందించనున్నట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన మైనార్టీ అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ లోపు ఆన్‌లైన్‌ (సీఈటీ.సీజీజీ.జీఓవీ.ఇన్‌.టీఎంఆర్‌ఐఈఎస్‌)లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్‌ 14న జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా మైనార్టీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు.

ఈవీఎం గోదాం పరిశీలన

జనగామ రూరల్‌: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నెలవారీ తనిఖీలో భాగంగా కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాంను గురువారం అదనపు కలెక్టర్‌ బెన్షాలోమ్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ పరిశీలనలో జనగామ ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్‌ మహిపాల్‌ రెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

గీత కార్మికులు సేఫ్టీ కిట్లను వినియోగించాలి

జఫర్‌గఢ్‌: ప్రమాదాల బారిన పడకుండా గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కేందుకు తప్పనిసరిగా కాటమయ్య సేఫ్టీ కిట్లను వినియోగించాలని జిల్లా కోఆర్డినేటర్‌ బాల్నే వెంకటమల్లయ్య కోరారు. మండలంలోని తీగారం గ్రామంలో సేఫ్టీ కిట్లపై గీత కార్మికులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వృత్తుల కంటే కల్లుగీత వృత్తి ప్రమాదకరమన్నారు. కాటమయ్య కిట్లు వాడడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎకై ్సజ్‌ సీఐ సంతోష్‌రెడ్డి, ట్రేనర్స్‌ కుర్ర ఉప్పలయ్య, కనకటి రాజయ్య, బాల్నే కార్తిక్‌, గడ్డం రామచంద్రం, గడ్డం శ్రీనివాస్‌, తౌటి సురేష్‌గౌడ్‌, రాకేష్‌, పెద్ద శ్రీనివాస్‌, తవిటి రాకేష్‌, శ్రవణ్‌, కుమార్‌, సతీష్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement