వైభవంగా హేమాచలుడి తెప్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా హేమాచలుడి తెప్పోత్సవం

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

మంగపేట: మల్లూరులోని హేమాచల క్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవం కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మరళీకృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణతో సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆలయంలోని మూలవిరాట్‌కు నిత్య పూజ, యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన ఆలయ సమీపంలోని ఎద్దు ముక్కు వద్ద గల ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం(స్నపనం) మహానివేదన కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 7 నుంచి 9గంటల వరకు చతుస్థానార్చన, తెప్పోత్సవం, దోపోత్సవం, శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం, హవనం కార్యక్రమ క్రతువులను వేద పండితులు మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెప్పోత్సవం కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పల్లకి(సేవ)పై మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోని కొలనులో రెండు గంటల పాటు తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఆలయ ప్రాంగణంలో దోపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు ముక్కామల శేఖర్‌ శర్మ, కారంపుడి పవన్‌కుమార్‌, అనిపెద్ది రాజీవ్‌శర్మ, ఏడునూతుల ఈశ్వర్‌చంద్‌ రామానుజం, బ్రహ్మోత్సవాల యాగ్నికులు పెరంబదూర్‌ మధనమోహనాచార్యులు, శ్రీ కృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement