జనగామ: పది సంవత్సరాలు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు వాస్తవానికి దూరంగా, రాజకీయ అక్కసుతో నిండిపోయి ఉన్నాయని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అన్నారు. శనివారం పురపాలికలోని తన చాంబర్లో మాట్లాడారు.. ఇటీవల జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను ఖండించారు. దశాబ్దకాలం పాటు మున్సిపాలిటీని అప్పుల బారిన పడేలా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అన్నారు. కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగడం వల్లే సభ వాయిదా పడిందని తెలిపారు. ఇంటింటికీ చెత్త సేకరణలో భాగంగా ప్రజలపై ఒక్క రూపాయి భారం పడకుండా 11 ఆటోలు కొనుగోలు చేయడంతో పాటు 30 మంది సిబ్బందిని నియమించేందుకు మంత్రి, కలెక్టర్ అనుమతిని ఇప్పటికే పొందినట్లు తెలిపారు.


