హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు గురువారం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. చూర్ణోత్సవం జరిపి చక్రతీర్థోత్సవం నిర్వహించి తిరిగి చక్రాన్ని అమ్మవారి సన్నిధికి చేర్చారు. అలాగే దేవాలయం చుట్టూ అమ్మవారి ఊరేగింపు జరపడానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి విరాళంగా అందజేయనున్న కోటి రూపాయలతో 30 అడుగుల రథం తయారీకి ఉపయోగించే కలపకు పూజలు చేశారు. శిల్పి గిర్మాజీ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అందజేసిన అడ్వాన్స్ రూ.45 లక్షలతో నాగపూర్ నుంచి తెప్పించిన మేలు రకం టేకు కలపకు అర్చకులు పూజలు చేసి పని ప్రారంభించారు.
అమ్మవారికి పుష్పయాగం
అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి స్నపనమందిరంలో వేదపండితులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా గులాబీలు, మల్లెలు, లిల్లీ లు, విరజాజు లు, బంతులు, చామంతులు, కనకాంబరాలతో పుష్పయాగం నిర్వహించారు. పుష్పయాగం నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోషాలు తొలగిపోతాయని భద్రకాళి శేషు తెలిపారు.
భద్రకాళి ఆలయంలో ముగిసిన
కల్యాణ బ్రహ్మోత్సవాలు


