జఫర్గఢ్: మొక్కజొన్న, వరి పంట ఒకేసారి చేతికి రావడంతో పల్లెలు ఎటూచూసినా ధాన్యపు రాశులతో కళకళలాడుతున్నాయి. అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఆలస్యం అవుతుండడంతో రైతులు వడ్లు, మక్కలనురోడ్లపైనే ఆరబోస్తున్నారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారు ఎస్సీ కాలనీ ప్రధాన రహదారి నుంచి మొదలుకొని తమ్మడపల్లి (జి) గ్రామం మీదుగా పాలకుర్తి మండలంలోని బమ్మెర శివారు వరకు రోడ్లపైనే కిలోమీటర్ల మేర రైతులు తమ ధాన్యాన్ని అరబోయడంతో పాటు పెద్ద ఎత్తున నిల్వలు చేశారు. ఇటీవల తమ్మడపల్లి (జి) గ్రామంతో పాటు జఫర్గఢ్లో ప్రధాన రహదారుల పక్కనే ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కల్లాలు లేకపోవడంతో ధాన్యంతో పాటు మక్కలను ఆరబోయడానికి రోడ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కొనుగోళ్లలో జాప్యం లేకుండా చేస్తే ఇబ్బందులు తప్పనున్నాయి.


