● ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రవాణా వేగవంతంగా జరగాలి
● సమీక్ష సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలని, రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ, ఐకేపీ, సివిల్ సప్లై, రవాణా, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలసత్వం, నిర్లక్ష్యం వహించి రైతులకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులను కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సివిల్ సప్ప్లై శాఖ అధికారులు ప్రతీ కొనుగోలు కేంద్రాన్ని నిరంతరం సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయ, సివిల్ సప్లై, రవాణా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, సివిల్ సప్లై డీఎం హతీరామ్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, అడిషనల్ డీఆర్డీఏ నూరోద్దీన్, పావని తదితరులు పాల్గొన్నారు.


