● పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ: బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల పయనంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యశ్వంతాపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పాత్ర అపారమని, అప్పటి సమైక్య పాలకుల అణచివేతకు తెరదించిన ఉద్యమం గులాబీ జెండా నేతృత్వంలో విజయవంతమైందని గుర్తు చేశారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలలో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక గులాబీ జెండాను ప్రజలు మరోసారి ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, జనగామ, ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


