దేవరుప్పుల/జనగామ రూరల్: ప్రాథమిక స్థాయిలోనే సాంకేతిక విద్యాబోధన తోడ్పాటు అందిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధురాలు రాపాక స్వాతినాగరాజు తెలిపారు. శనివారం మండలంలోని నీర్మాల ఎస్సీకాలనీ, దొడ్లబండతండా, బంజర, కడవెండి, చిన్నమడూరు, పెద్దమడూరు, సింగరాజుపల్లి ప్రాథమిక పాఠశాలతో పాటు జనగామ పట్టణంలోని ప్రాథమిక పాఠశాలకు సంస్థ ఆధ్వర్యంలో కంప్యూటర్లను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలు సుధామూర్తి ఆశయంతో ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల అభ్యున్నతికి కంప్యూటర్లను అందజేస్తున్నామన్నారు. ప్రతీ విద్యార్థి ప్రాథమిక స్థాయిలోనే టెక్నాలజీని నేర్చుకొని శాస్త్ర సాంకేతిక రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కొల్ల మహిపాల్ రెడ్డి, దేవరుప్పుల మండల అసోసియేట్ ప్రెసిడెంట్ శివగారి కిరణ్ కుమార్, బోగ్గారపు శ్రీనివాస్, హెచ్ఎంలు గైని శంకరయ్య, మరియాల మాధవి, బాస్కుల అంజయ్య, వెంకన్న, సుహాసిని, భాగ్యలక్ష్మి, రజనీ, దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


