
తెలంగాణ తల్లి విగ్రహంపై రాద్ధాంతం అర్థరహితం
● కన్నతల్లిని తలపించేలా
విగ్రహ రూపకల్పన
● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
పాలకుర్తిటౌన్: మన కన్న తల్లులను తలపించేలా .. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రతిపక్షాల రాద్ధాంతం సరికాదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో అధికారికంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డిలతో కలిసి ర్యాలీలో పాల్గొన్న మంత్రి విగ్రహావిష్కరణ అనంతరం ప్రసంగించారు. దొరల గడీల ఆనవాళ్లు, రాచరికపు పోకడలు పాత విగ్రహంలో కనిపించాయని, వాటికి చోటు లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల ముందుకు తెచ్చామన్నారు. దానిపై బీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. సచివాలయం తర్వాత రాష్ట్రంలోనే రెండో తెలంగాణ తల్లి విగ్రహం పాలకుర్తిలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా.. పట్టణంలోని దళితకాలనీకి చెందిన గాదెపాక దోతి ఎల్లయ్య ఇంట్లో మంత్రి శ్రీనివాస్రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్లు భోజనం చేశారు. అనంతరం ఎల్లయ్య, వెంకటమ్మ దంపతులకు మంత్రి నూతన వస్త్రాలు బహూకరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ, హామ్యానాయక్, ఏఎంసీ చైర్పర్సన్లు మంజుల, ఆండాలు, నాయకులు రాఘవరావు, కుమారస్వామి, శ్రీరాములు, శ్రీనివాస్, యాకాంతరావు, మదార్, హరీష్, నాగన్న పాల్గొన్నారు.