12 వరకు ఉత్సవాలు కొండగట్టుకు తరలిరానున్న లక్షలాది మంది భక్తులు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు
మల్యాల: ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజులపాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం నుంచి తీసుకొచ్చిన పట్టువస్త్రాలను ఈనెల 10న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారికి సమర్పించనున్నారు. 11న స్థాపిత దేవతారాధన, హోమం నిర్వహిస్తారు. 12న స్వామివారి పెద్ద జయంతి సందర్భంగా ఉదయం 3 గంటలకు తిరుమంజనం, 6 గంటలకు ద్రవిడ ప్రబంధ పారాయణం, విశేష అభిషేకం, తులసీ అర్చన, పట్టు వస్త్రాల అలంకరణ, ఉత్సవమూర్తికి ఊయల సేవ, సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.
ఉత్సవాలకు అంకురార్పణ
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలకు శనివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలతో అంకురార్పణ చేశారు. యాగశాల శుద్ధి, పుణ్యహచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ అంజనా రెడ్డి, ప్రధాన అర్చకులు రామకృష్ణ, స్థానాచార్యులు కపీందర్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, సునీల్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.


