
వేతనాలు వచ్చేదెప్పుడో..?
గొల్లపల్లి: డీఎస్సీ–2008లో వారంతా అర్హత సాధించారు. పోస్టింగ్ రావడంలో ఆలస్యం కాగా.. 16 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిని కాంట్రాక్టు పద్ధతిలోనే విధుల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి అందే వేతనాలు కావడంతో భరోసా ఉంటుందని భావించారు ఆ ఉపాధ్యాయులు. అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాలు మానుకుని ఉపాధ్యాయులుగా చేరారు. వారికి నాలుగు నెలలైనా వేతనం రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో 38 మంది
జిల్లాలో డీఎస్సీ – 2008 అభ్యర్థులు 38 మంది ఈ ఏడాది ఫిబ్రవరి 15న విధుల్లో చేరారు. వారిని వివిధ పాఠశాలలకు కేటాయించగా పాఠాలు బోధిస్తున్నారు. నాలుగు నెలలుగా వేతనాలు మాత్రం పొందడం లేదు. విద్యా సంవత్సరం చివరలో ఆయా ఉపాధ్యాయులను టెర్మినేట్ చేసిన విద్యాశాఖ.. వేతనాల జారీలో మాత్రం జాప్యం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
కుటుంబ పోషణ కష్టంగా ఉంది
ఎంతో ఆశతో ఉద్యోగాలు చేస్తూ వచ్చాం. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టమవుతోంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఇటీవలే జరిగిన ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో రెగ్యులర్ ఉపాధ్యాయులతోపాటు ఐదు రోజులు పాల్గొన్నాం.
– శివకుమార్, ఎంపీపీఎస్, భీమారం
వేతనాలు ఇవ్వాలి
కస్తూరిభా పాఠశాలలో సీఆర్టీ ఉద్యోగం మానేసి పాఠశాలలో చేరాను. ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదు. ఏప్రిల్ 23న టెర్మినేట్ చేశారు. మిగితా కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులను మూడు రోజుల్లో విధల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వం మా ఆవేదనను అర్థం చేసుకుని వేతనాలు చెల్లించాలి.
– జయ, పీఎస్, తొత్తునూర్
కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఎదురుచూపులు
నాలుగు నెలలుగా జీతం అందక ఇక్కట్లు
సర్వీసు పునరుద్ధరణపై నీలినీడలు
పెండింగ్లో ఉన్నాయి
2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతనాల అంశం రాష్ట్రస్థాయిలో ఉంది. జిల్లాలో 38 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికి నాలుగు నెలలకు సంబంధించిన వేతనాలు ఇవ్వాల్సిన మాట వాస్తవమే. వేతనాలు, సర్వీసు పునరుద్ధరణపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– రాము, డీఈఓ

వేతనాలు వచ్చేదెప్పుడో..?