
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
రాయికల్: మండలంలోని అల్లీపూర్కు చెందిన సిరిపురం శ్రీహరి (47) అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. శ్రీహరి బీడీ ప్యాకర్గా పనిచేస్తున్నాడు. కుటుంబపోషణకు కొంత అప్పు చేశాడు. ఇటీవలే కూతురు పెళ్లి చేశాడు. మొత్తం రూ.8లక్షల వరకు అప్పు ఉందని, దానిని ఎలా తీర్చలోనని నిత్యం మనస్తాపం చెందుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. శ్రీహరి భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
పరారైన ఖైదీ కోసం లుక్ ఆఫ్ నోటీస్
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోర్టు నుంచి మంగళవారం సాయంత్రం పరారైన జున్ను ప్రసాద్ కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్ను పట్టుకునేందుకు పోలీసు శాఖ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు విదేశాలకు పారిపోకుండా బుధవారం ఉదయమే దేశంలోని అన్ని ఎయిర్పోర్టులకు లుక్ ఆఫ్ నోటీసు జారీ చేశారు.
4.35 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ఇప్పటివరకు 4.35లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్.లత తెలిపారు. 4.33 లక్షల టన్నుల దొడ్డురకం, 2,475 టన్నుల సన్నరకం కొన్నామని, అకాల వర్షాలు కురుస్తున్నా.. ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించామని పేర్కొన్నారు. ఇంకా 925 టన్నుల ధాన్యం కేంద్రాల్లో ఉందని, యుద్ధప్రతిపాదిక తరలిస్తున్నామని వివరించారు. రైతులకు రూ.1010 కోట్లకు రూ.950.69 కోట్లకు ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేశామని, రూ.893.71 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు.
తిర్మలాపూర్లో అత్యధిక వర్షం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు కొడిమ్యాల మండలం తిర్మలాపూర్లో 103.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పెగడపల్లిలో 72.8 మి.మీ, కథలాపూర్లో 64.8, కొడిమ్యాల మండలం పూడూర్లో 62, భీమారం మండలం గోవిందారంలో 56.8, మల్యాల మండలం మద్దుట్లలో 53, మేడిపల్లిలో 48.3, సారంగాపూర్లో 44.3, కోరుట్లలో 39, భీమారం మండలం మన్నెగూడెంలో 31.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.