
నోరు తెరిచిన మ్యాన్హోల్స్
● పట్టింపులేని అధికారులు ● తరచూ ప్రమాదాలు ● సమీపించిన వర్షకాలం ● వరద ప్రవాహంలో వెళ్తే అంతే.. ● ఇటీవల ఓ వృద్ధుడు పడిపోయిన వైనం
జగిత్యాల: జిల్లాకేంద్రంలో మ్యాన్హోళ్లు నోరు తెరుచుకున్నాయి. బైపాస్రోడ్, యావర్రోడ్ ఇరుకుగా ఉండడం.. వాహనాల సంఖ్య పెరగడం.. ఆ మేరకు ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. జిల్లాకేంద్రం కాకముందు బైపాస్రోడ్ నిర్మించారు. జిల్లాగా అవతరించాక వ్యాపార, వాణిజ్య కేంద్రాలన్నీ బైపాస్రోడ్లోనే ఏర్పాటయ్యాయి. దీంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. యావర్రోడ్ ఇరుకుగా మారింది. కొన్నేళ్ల క్రితం నుంచే ఎస్సారెస్పీ కాలువ ఉండగా.. దానిపై కప్పు వేసి కాలువకు ఇరువైపులా రోడ్డు వేశారు. కాలువపై పెద్ద ఎత్తున డివైడర్లను ఏర్పాటు చేశారు. కాలువ కన్పించకుండా నిర్మాణం చేపట్టినా.. అక్కడక్కడ మ్యాన్హోల్స్ ఉండటంతో అవి ప్రమాదకరంగా మారాయి. విపరీతంగా వాహనాలు రావడం.. పెద్దపెద్ద వాహనాలు కూడా ఈ మార్గంమీదుగానే ధర్మపురి, గొల్లపల్లి వైపు వెళ్తుండడంతో రద్దీ మారుతోంది. ఈ కాలువపై అక్కడక్కడ కప్పులు నిర్మాణం చేపట్టినప్పటికీ ఏళ్ల క్రితం కావడంతో కొన్ని చోట్ల నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. మరమ్మతు చేయించకపోవడంతో వాహనదారులు మ్యాన్హోల్స్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. బైపాస్రోడ్ అనేది టౌన్ ప్రిన్సెస్ కన్నా ఎక్కువ కావడంతో అటు వైపు ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్, వ్యాపార వాణిజ్య కేంద్రాలు, ఫంక్షన్హాల్స్ అత్యధికంగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రస్తుతం కాలువ పైన ఏర్పాటు చేసిన డివైడర్లను, మ్యాన్హోల్స్ మరమ్మతు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బైపాస్రోడ్ కరీంనగర్ రోడ్ నుంచి ధర్మపురి రోడ్కు వెళ్తుంది. ఈ మధ్యలో ఎస్సారెస్పీ కాలువ పెద్దది కావడంతో దాదాపు 10 ఫీట్ల వెడల్పుతో డివైడర్లు నిర్మించారు. ఆ కాలువ కింద నుంచి ఎస్సారెస్పీ నీరు వెళ్తుంది. వర్షకాలం భారీగా వర్షం కురిస్తే అది ఉప్పొంగుతుంది. దీంతో ప్రమాదం ఎంతో పొంచి ఉంది. ముఖ్యంగా గొల్లపల్లి రోడ్లోని శ్మశాన వాటిక వద్ద ఎలాంటి పైకప్పు లేకుండా కేవలం ఐరన్తో ఏర్పాటు చేసినప్పటికీ అది ఊడిపోయింది. నాయీబ్రాహ్మణ సంఘం భవనం సమీపంలో కాలువపై పైకప్పు లేకపోవడంతో అందులో వాహనదారులు పడిపోతున్నారు. ఒకవేళ వర్షకాలం భారీగా వర్షం కురిసినప్పుడు పడితే దాదాపు మనుషులు బతికే అవకాశాలు ఉండవు.
రెండు కిలోమీటర్లకు పైగానే కాలువ
కరీంనగర్ రోడ్ నుంచి ధర్మపురి రోడ్ వరకు వెళ్లే బైపాస్రోడ్ రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఎస్సారెస్పీ కాలువ మధ్యలో ఉండటంతో రోడ్డంతా వన్వేగా మారింది. ఎటు వైపు వాహనాలు అటు వెళ్తున్నప్పటికీ మధ్యలో ఈ మ్యాన్హోల్స్ ఉండడం ప్రమాదకరంగా మారింది. ఎత్తు ఉన్నప్పటికీ ఒక్కోసారి అదుపుతప్పి అందులోకే వెళ్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బైపాస్రోడ్లో ఉన్న ఎస్సారెస్పీ కాలువపై పూర్తిస్థాయి పైకప్పులు, డివైడర్ల ఎత్తు పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఈనెల 22న.. జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ముకుందరెడ్డి అనే వృద్ధుడు ద్విచక్రవాహనంపై రోడ్డుపై వస్తున్నాడు. నాయీబ్రాహ్మణ సంఘం సమీపంలోని మ్యాన్హోల్లో ద్విచక్రవాహనంతోపాటు పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి వృద్ధుడితోపాటు ద్విచక్రవాహనాన్ని బయటకు తీశారు. మ్యాన్హోల్లో ప్రవాహం లేకుంటే సదరు వృద్ధుడి పరిస్థితి వేరేలా ఉండేది.
సుమారు నెల క్రితం.. ఓ కారు అతి వేగంగా వచ్చి డివైడర్లను ఢీకొంది. కాలువ పైకప్పు ఎక్కి ఆగిపోయింది. దానికి ఒకే అడుగు దూరంలో పెద్ద డ్రైనేజీ ఉంది. ప్రమాదవశాత్తు కారులో అందులో పడిపోతే కారులో ఉన్న వారే బతికే అవకాశమే లేకుండేది. మ్యాన్హోల్ సమీపంలో కారు ఆగి పోవడంతో ప్రమాదం తప్పింది. ఇలా జిల్లా కేంద్రంలో నిత్యం బైపాస్రోడ్లో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది.
మోతె చౌరస్తాలోని బైపాస్రోడ్లోని పైకప్పు లేని కాలువ
పైకప్పులు ఏర్పాటు చేయాలి
బైపాస్రోడ్లో ఒకప్పుడు పెద్ద ఎస్సారెస్పీ కాలువ ఉండేది. దానిపైనుంచే డివైడర్లు ఏర్పాటు చేసి రోడ్డు ఏర్పాటు చేశారు. పైన కప్పులు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి వాటిపైన ఇనుప చువ్వలను ఏర్పాటు చేసి పైకప్పు నిర్మించాల్సి ఉంది.
– అనిల్, జగిత్యాల
ప్రమాదకరంగా ఉన్నాయి
మ్యాన్హోల్స్ ప్రమాదకరంగా ఉన్నాయి. వాటిపై ఇనుప చువ్వలతో ఉన్న కప్పులు వేయాలి. ప్రమాదాలను నివారించాలి. బైపాస్రోడ్లాగా లేదు. బైపాస్రోడ్ సిటీ మధ్యలో ఉంది. మరో బైపాస్రోడ్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
– మచ్చ శంకర్, జగిత్యాల

నోరు తెరిచిన మ్యాన్హోల్స్

నోరు తెరిచిన మ్యాన్హోల్స్

నోరు తెరిచిన మ్యాన్హోల్స్

నోరు తెరిచిన మ్యాన్హోల్స్

నోరు తెరిచిన మ్యాన్హోల్స్