
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
● నేడు రెండు కేంద్రాల్లో పరీక్ష ● సకాలంలో కేంద్రాలకు చేరాలి ● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: ఈనెల 4న నిర్వహించనున్న నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని, అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా పరిధిలో రెండు పరీక్ష కేంద్రాల్లో 768 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్థులను ఉదయం 11 నుంచి 1.30 వరకు లోనికి అనుమతిస్తారని తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్కార్డులో పాస్పోర్ట్ సైజు ఫొటో, మరో పోస్ట్కార్డు ఫొటోను అడ్మిట్కార్డుకు అతికించాలన్నారు. ఒక ఫొటోను అదనంగా వెంట తెచ్చుకోవాలన్నారు. పెన్నులు, పెన్సిల్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దని సూచించారు. పరీక్ష కేంద్రంలోనే పెన్నులు అందించనున్నట్లు వెల్లడించారు. మొబైల్స్, చేతిగడియారాలు, బ్లూటూత్ వంటివి అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కొడిమ్యాల మండలం నాచుపల్లి వద్దగల జేఎన్టీయూ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. మొత్తం రెండు కేంద్రాల్లో.. మొదటి కేంద్రంలో 480, రెండో కేంద్రంలో 278 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, జేఎన్టీయూ ప్రిన్సిపల్ ప్రభాకర్ పాల్గొన్నారు.
ఎండలతో అప్రమత్తంగా ఉండాలి
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలకు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఎండతీవ్రతతో శరీర ఉష్ణోగ్రత పెరిగి మెదడుపై ప్రభావం చూపుతుందని, ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయటకు వెళ్తే టోపీలు ధరించాలని, ఉదయం 11 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తర్వాత బయటకు వెళ్లాలన్నారు. పనిచేసే చోట్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
నవదుర్గ ఆలయానికి రూ.కోటి మంజూరు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని నవదుర్గ ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కవిత రూ.కోటి నిధులు మంజూరు చేశారు. మంజూరు పత్రాన్ని నవదుర్గ సేవ సమితి సభ్యులకు శనివారం అందించారు. అమ్మవారి దయ అందరిపై ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, కస్తూరి శ్రీనివాస్, నాగరాజు, ఉమాపతి, విజయ్కుమార్, జితేందర్, వెంకటరమణ పాల్గొన్నారు.
ఘనంగా శంకరాచార్య, రామానుజాచార్యుల జయంతి
కోరుట్ల: పట్టణంలో శ్రీ ఆది శంకరాచార్య, రామానుజాచార్యల జయంతి ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణ సమితి, హిందూ ఐక్యవేదిక తెలంగాణా కన్వీనర్ వొడ్నాల రామారావు మాట్లాడుతూ ఆది శంకరాచార్యులు, రామానుజా చార్యులు భక్తి ఉద్యమం, భోదనలతో హిందూ మతానికి నూతన దిశను ఏర్పరచిన సామాజిక సంస్కర్తలని తెలిపారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో హిందూవాహిని సభ్యులు ప్రకాష్, అమర్నాధ్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి

‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి