మాస్కో: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కీలక ప్రకటన చేశారు. భారత్కు రష్యా నుండి సరఫరా అవుతున్న చమురులో ఏటువంటి ఆటంకం రానివ్వమన్నారు. తమ మిత్రదేశమైన భారత ఇంధన ప్రయోజనాలకు మాస్కో అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. త్వరలో భారత పర్యటనకు రానున్నట్లు విదేశాంగ మంత్రి తెలిపారు.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ త్వరలో భారత్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పలు కీలక అంశాలు వెల్లడించారు. తాను ఇప్పటి వరకూ చూసిన అత్యంత శక్తివంతమైన నాయకులలో భారత ప్రధాని మోదీ ఒకరని కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చమురు విషయంలో సంక్షోభం నెలకొన్నప్పటికీ భారత్తో ఒప్పందం చేసుకున్న విధంగా రష్యా చమురు అందిస్తుందని తెలిపారు.
ఇంధన సరఫరా విషయంలో భారత్తో పాటు వేరే ఏదేశానికి ఇచ్చిన హామీని రష్యా ఎన్నడూ తప్పలేదన్నారు.కుడంకుళంలో నిర్మిస్తున్న అణువిద్యుత్ కేంద్రం భారత్ విద్యుత్ అవసరాలను గణనీయంగా తీరుస్తుందన్నారు. భారత-రష్యా మధ్య సంబంధాలు ఎంతో స్నేహపూర్వకమైనవని ఈ మైత్రి తరతరాలదన్నారు. హిందీ-రుసీ భాయ్-భాయ్ (భారతీయులు- రష్యన్లు సోదరులు) అనే నినాదం సరదాది కాదని అది ఇరు దేశాల సంస్కృతిలో భాగమైందన్నారు.


