దుబాయ్: ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు 1447 హిజ్రీ సంవత్సరానికి సంబంధించిన ఈద్ అల్ అధా సెలవులను దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం.. సెలవులు మే 25న ప్రారంభమై మే 29 వరకు కొనసాగనున్నాయి. మే 30, 31 తేదీలు వారాంతపు సెలవులు కావడంతో కార్యాలయాలు జూన్ 1నుంచి తిరిగి ప్రారంభమవుతాయి.
అయితే, షిఫ్ట్ విధానంలో పనిచేసే సంస్థలు, అలాగే కస్టమర్ సేవలు, ప్రజా సేవా సౌకర్యాల నిర్వహణ బాధ్యతలు నిర్వహించే విభాగాలు తమ కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా పని వేళలను నిర్ణయించుకోవచ్చని డీజీహెచ్ఆర్ స్పష్టం చేసింది. సెలవు కాలంలో ప్రజలకు సేవలు అంతరాయం లేకుండా కొనసాగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకునే అవకాశం కల్పించింది.
ఈ సందర్భంగా దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం యూఏఈ నాయకత్వానికి, ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ పవిత్ర పర్వదినం అందరికీ శాంతి, సుభిక్షం, ఆనందం, ఆశీర్వాదాలను తీసుకురావాలని ఆకాంక్షించింది.
ఇదిలా ఉండగా, ధు అల్ హిజ్జా నెల చంద్రవంక దర్శనానికి సంబంధించి దుబాయ్ అధికారులు 2026 మే 17న ప్రత్యేక బహిరంగ చంద్ర వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ డైరెక్టర్ల బోర్డు చైర్మన్, అలాగే అరబ్ యూనియన్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్సెస్ సభ్యుడు ఇబ్రహీం అల్ జర్వాన్ తెలిపిన వివరాల ప్రకారం, ధు అల్ హిజ్జా అమావాస్య 2026 మే 17 ఆదివారం యూఏఈ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు సంభవించనుంది.
ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్లో చివరి నెల అయిన ధు అల్ హిజ్జా 10వ రోజున ఈద్ అల్ అధా జరుపుకుంటారు. అరాఫా మే 26 మంగళవారం వచ్చే అవకాశం ఉంది. ఈద్ అల్ అధా పర్వదినం మే 27 బుధవారం ఉదయం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.


