పంటకు రికార్డు ధర
కేసముద్రం: కొన్నేళ్ల క్రితం పసుపు పంటకు సరైన ధర లేక రైతులు నిరాశ చెందేవారు. ఫలితంగా కాలక్రమేనా సాగు విస్తీర్ణం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అమాంతం పడిపోయింది. ఒక పక్క సరైన ధర లేక, దిగుబడి రాక.. మరోవైపు పెట్టుబడులు పెట్టలేక రైతులు ఇతర పంటల సాగుపై దృష్టిసారించారు. అప్పటి వరకు మార్కెట్లో పసుపు పంటకు క్వింటాకు గరిష్ట ధర రూ.5 వేల నుంచి రూ.6వేల వరకే పలికేది. ఈ ఈక్రమంలో 2023–24 కాలంలో క్వింటాకు ఒక్కసారిగా ధర రూ.10వేలు దాటింది. దీంతో కొంత ఊరట కలగడంతో సంప్రదాయ పంటగా సాగు చేస్తున్న పలువురు రైతులు యథావిధిగా పసుపు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాది మార్చి నుంచి పసుపు సీజన్ ప్రారంభం కాగా, మొదట్లో క్వింటాకు గరిష్ట ధర రూ.12 వేల వరకు పలికింది. మళ్లీ ధర కొంతమేర తగ్గుముఖం పడుతుండడంతో రైతులు ఆందోళనకు గురై పంటను అమ్ముకున్నారు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి మళ్లీ పసుపు ధర పెరుగుతోంది. క్వింటాకు గరిష్ట ధర రూ.13 వేల నుంచి రూ.14వేల వరకు చేరింది. కాగా. బుధవారం(ఈనెల15న) మార్కెట్కు 306 బస్తాల పసుపు అమ్మకానికి రాగా, కాడిరకం పంటకు (పాలిష్ చేసిన పసుపు) క్వింటాకు గరిష్ట ధర రూ.16,159, గరిష్ట ధర రూ.10,300 పలికింది. గోళా రకానికి గరిష్ట ధర రూ.15,500, కనిష్ట ధర రూ.11,101 పలికింది. గురువారం మార్కెట్కు 606 బస్తాల పసుపు అమ్మకానికి రాగా, కాడిరకానికి గరిష్ట ధర రూ.15,555, కనిష్ట ధర రూ.10,239 పలికింది. గోళా రకానికి గరిష్ట ధర రూ.15వేలు, కనిష్ట ధర రూ.11,989 పలికింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే క్వింటాకు ధర రూ. వెయ్యి దాటింది. ఇప్పటి వరకు పసుపు పంటను భద్రపరుచుకున్న రైతులకు క్వింటాకు రూ.3వేలకు పైగా వరకు కలిసి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ధర లేక తగ్గుతూ వచ్చిన పసుపు సాగు విస్తీర్ణం..
పసుపు పంటకు కేరాఫ్గా ఉన్న కేసముద్రంలో 2015 వరకు 6 వేల ఎకరాలకు పైగా రైతులు సాగు చేశారు. ఆ తర్వాత పంటకు ధరలేక, మరోవైపు దిగుబడులు రాకపోవడంతో, క్రమక్రమంగా విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ఈ మేరకు ఈ వానాకాలం కేసముద్రం మండలంలో 66 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తుండగా, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 600 ఎకరాల్లోపు సాగు చేయనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా పసుపు సాగు చేసే ప్రాంతాల్లో విస్తీర్ణం అమాంతం తగ్గిపోయింది. పసుపునకు బదులు రైతులు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ధర పెగుతుండటంతో రైతుల్లో ఊరట కలుగుతున్నా, పసుపు విత్తనం దొరకపోవడంతో ఇతర పంటలనే రైతులు సాగు చేసుకుంటున్నారు.
కేసముద్రం మార్కెట్కు వచ్చిన పసుపు, ధరల వివరాలు
సంవత్సరం క్వింటాళ్లు గరిష్ట ధర కనిష్ట ధర
2018–19 85,378 రూ.7,713 రూ.4,000
2019–20 1,22,931 రూ.6,659 రూ.3,109
2020–21 9,7083 రూ.8,081 రూ.3,011
2021–22 62,646 రూ.7,811 రూ.2,952
2022–23 1,43,368 రూ.11,352 రూ.7,801
2023–24 11,992 రూ.13,221 రూ.5,000
2024–25 5,372 రూ.16,368 రూ.4,559
2025–26 16,306 రూ.13,852 రూ.5,000
2026–27 13,193 రూ.16,159 రూ.10,300
క్వింటా రూ.16 వేల పైనే
దాచుకున్న రైతులకు పసుపు బంగారమే..


