టీజీ ఎన్పీడీసీఎల్లో అక్రమార్కులు!
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో కొంతమంది అందినకాడికి దోచుకుంటూ సంస్థ పరువు తీస్తున్నారని విద్యుత్ ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యున్నతస్థాయి అధికారి కూడా అక్రమాలకు పాల్పడితే సంస్థకు రక్షణ ఎక్కడుందని విద్యుత్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తన కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు నకిలీ మెడికల్ బిల్లులు సృష్టించి టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అత్యున్నత స్థాయి అధికారి సొమ్ము రీయింబర్స్మెంట్ చేసుకున్నారని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతి నెల రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు అధికారులు సొంత సంస్థకు కన్నం వేస్తున్నారని సమాచారం. కిందిస్థాయి ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే నియంత్రించాల్సిన అధికారే అక్రమాలకు పాల్పడితే సంస్థను కాపాడే వారు ఎవరని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. నవ్విపోదురు గాక నాకేంటి అన్న చందంగా ఎవరేమనుకుంటే నాకేంటి తన జేబులు నిండితే చాలు అన్నట్లు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సదరు అధికారి ఇలాంటి నకిలీ బిల్లులతో రీయింబర్స్మెంట్ చేసుకోవడం ఇదే మొదటి సారా? గతంలోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టీజీ ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ విభా గం విచారణ చేపట్టినట్లు తెలిసింది. విజిలెన్స్ విచా రణ నివేదిక వచ్చిన తర్వాత సమగ్ర విచారణ చేపట్టనున్నారు. దీంతో పాటు ఎన్పీడీసీఎల్ పరిధిలో ఇలాంటి అక్రమాలు ఎక్కడైనా జరిగాయా అనే కోణంలో యాజమాన్యం దృష్టి సారించింది. మెడికల్ బిల్లులపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.
నకిలీ మెడికల్ బిల్లులు
సృష్టించి రీయింబర్స్మెంట్
కుమారుడు ఆస్పత్రిలో చికిత్స
పొందినట్లు బిల్లులు తయారు
చేశారని ఆరోపణలు
అత్యున్నత స్థాయిలో ఉండి ఓ అధికారి సొంత సంస్థకే కన్నం


